జైరాంపై కావూరి ఫైర్.. వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు...!

గురువారం, 3 ఏప్రియల్ 2014 (18:35 IST)
IFM
FILE
కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు ఆగ్రహోద్రుక్తులయ్యారు. కేవలం వ్యాపారాల కోసమే బీజేపీలో చేరారన్న జైరాం వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితికి జైరాం రమేషే కారణమని తెలిపారు. జైరాంలాంటి వారిని నమ్మరాదని చెప్పారు.

సోనియా గాంధీ కోసం తాను పీవీ నరసింహారావుకు కూడా దూరమయ్యానని చెప్పారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన మేధావి అయిపోతారా అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవికి కావూరి రాజీనామా, బిజెపిలోకి చేరుతారనే వార్తల నేపథ్యంలో జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యాపారాల కోసమే కావూరి బీజేపీ వైపు వెళ్తున్నారన్నారు. దీనిపై కావూరి మండిపడ్డారు. తాను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోసం దివంగత పివి నర్సింహా రావుకు దూరమయ్యానని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ ఒక్క సీటు కూడా గెలువదన్నారు. సీమాంధ్రలో ప్రస్తుత పరిస్థితికి జైరాం రమేషే కారణమన్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువలేని జైరాం రమేష్ తమకు చెప్పడమేమిటన్నారు. ప్రజల మద్దతు లేని, ఎన్నికలలో గెలువలేని జైరాం వంటి వారిని ప్రోత్సహించవద్దని నిప్పులు చెరిగారు. ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను యువతలో నైపుణ్యం అభివృద్ధికి కేటాయించాలని తాను చెప్పానన్నారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని కాంగ్రెస్ అధిష్టానం వద్ద కుప్పిగుంతలు వేస్తున్నారని ఆరోపించారు.

జైరాం వంటి వారు ప్రజల్లో దమ్మిడికి పనికి రాని వారన్నారు. సోనియా కోసం తాను బంగారం లాంటి పివికి దూరమయ్యానని, వ్యాపారాల కోసమే అయితే.. తాను అప్పుడు పివితోనే ఉండేవాడినన్నారు. రెండు పుస్తకాలు చదివి, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చదివిన వారే పార్టీకి అవసరమైతే ఇంకా చాలామంది ఉన్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి