'జై ఆంధ్రా' అంటూనే బస్సులపై రాళ్లు విసిరారు : అశోక్ బాబు

FILE
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ముగిసిన వెంటనే బస్సుల్లో సీమాంధ్ర ప్రాంతానికి వెళుతున్న ఏపీఎన్జీవోలపై హైదరాబాదు శివార్లలో ఓ పథకం ప్రకారమే దాడి చేశారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు.

రాజధానిలోని ఏపీఎన్జీవో భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించిన కొందరు వ్యక్తులు బైక్‌లపై బస్సులను వెంబడించారని, రాళ్ళతో బస్సులపై దాడి చేశారని వివరించారు.

ఈ దాడిలో పలువురు ఉద్యోగులకు తీవ్రగాయాలయ్యాయని అశోక్ తెలిపారు. రాళ్ళదాడిలో 4 బస్సులు ధ్వంసంకాగా, 5 బస్సులకు అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు.

'జై ఆంధ్రా' అంటూ నినాదాలు చేస్తూనే వారు బస్సులపై రాళ్ళు విసిరినట్టు అశోక్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన వాళ్ళను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరుతున్నామన్నారు. కాగా, కొందరు రాజకీయనాయకులు తెలంగాణ వారిపై సమైక్యవాదులు దాడి చేశారని చెప్పడం బాధాకరమని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి