టీఆర్ఎస్‌కు చావుడబ్బా : కేసీఆర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు!

సోమవారం, 10 జూన్ 2013 (13:12 IST)
File
FILE
టీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన చింతా స్వామి మాదిగ ఆ పార్టీకి చావుడబ్బా మోగించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తనను కులం పేరుతో దూషించారంటూ చింతా స్వామి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి, పద్మారావు, సుభాష్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

కాగా, చింతా స్వామి ఆదివారం తెలంగాణ భవన్ ఎదుట చావు డప్పు మోగించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆందోళనకారులపై తెరాస శ్రేణులు దాడికి దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ ఉద్యమాన్ని వ్యాపారం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ భవన్ ముందు ఆదివారం మధ్యాహ్నం చావు డప్పు మోగిస్తామని చింత స్వామి అంతకుముందే ప్రకటించారు.

దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ ముందున్న రోడ్డుకు రెండువైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయినప్పటికీ చింతాస్వామి అక్కడకు చేరుకుని చావుడబ్బా మోగించి అందరినీ విస్మయపరిచాడు.

వెబ్దునియా పై చదవండి