టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు .. త్వరలో కాంగ్రెస్ తీర్థం!

బుధవారం, 7 ఆగస్టు 2013 (14:41 IST)
File
FILE
కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, విధానాలతో విసిగి పోయిన టీఆర్ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధుల్లో ఏడు నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ నేతృత్వంలోని కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో తేరుకున్న కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మెదక్‌ ఎంపీ విజయశాంతి పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె మాటలోనే మరో ఇద్దరు మాజీ ఎంపీలు కూడా పయనిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న విధానాలతో వీరంతా విసిగి పోవడం వల్లే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సీనియర్ నేతలు చంద్రశేఖర్‌, చందూలాల్ మరికొంతమంది ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ను కలుసుకోవడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే బాటలో మరికొంతమంది మాజీ ఎంపీలు కూడా దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. వీటన్నింటిని తట్టుకునేందుకు కేసీఆర్ ఏకంగా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కూడా ఆసక్తి చూపొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి