తెలంగాణాపై బిగుసుకున్న పీటముడిని విప్పేద్దాం రండంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నాయకులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, నీరు, నిధుల పంపకంపై చర్చించుకుంటే పరిష్కార మార్గం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
శనివారం తెలంగాణా నేతలు సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు ఇంట్లో సమావేశమై తెలంగాణా సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు జానా రెడ్డి, సారయ్యలతోపాటు ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి తదితురలు పాల్గొన్నారు.
గతంలో పి. చిదంబరం మాట్లాడుతూ... తెలంగాణా అంశంపై ఓ పరిష్కార మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజలే కనుగొనాలని సూచించారు. లేని పక్షంలో తెలంగాణా అంశం ఎన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా నాన్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం వైఖరిని తెలుసుకున్న తెలంగాణా ప్రాంత నాయకులు సీమాంధ్ర నాయకులతో మాట్లాడి ఏదోవిధంగా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని యోచన చేస్తున్నారు. మరి పరిష్కార మార్గం దొరుకుందో లేదో చూడాలి.