నరేంద్ర మోడీ నవభారత యువభేరి ప్రచార సభ... విభజన భగ్గుపై ఏంటి...?

శనివారం, 10 ఆగస్టు 2013 (22:22 IST)
WD

గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా తరపు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి హైదరాబాదులో నవభారత యువభేరి ప్రచార సభను ప్రారంభించబోతున్నారు. ఈ సభకు హాజరయ్యేవారు రూ. 5 చెల్లించి తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల ప్రచారంగా చెప్పుకుంటున్న ఈ యువభేరి ప్రచార సభను దక్షిణాది నుంచి సెంటిమెంటుగా ప్రారంభించబోతున్నట్లు భాజపా నాయకులు చెపుతున్నారు.

కాగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయంతో భగ్గుమంటున్న తరుణంలో నరేంద్ర మోడీ సభకు కూడా సెగ తగిలే అవకాశం ఉంది. కాగా రాయలసీమ, కోస్తాంధ్ర నుంచి వచ్చే కార్యకర్తలు మోడీ సభకు అడ్డు తగిలి జై సమైక్యాంధ్ర నినాదాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ వారిని ఎలా సముదాయిస్తారన్నది చూడాల్సి ఉంది.

రూ. 5 చెల్లించి నమోదు చేసుకున్నవారికి ఐడీ కార్డులు జారీ చేశారు. ఈ కార్డులున్నవారినే లోపలికి అనుమతించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మోడీ ప్రచారసభకు సుమారు లక్షన్నర మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

కాగా రాష్ట్ర విభజన వేడి సీమాంధ్ర ప్రాంతంలో మరింత ఎక్కువైంది. ఉద్యమం సునామీలా మారింది. అన్నీ వర్గాల ప్రజలే కాదు.. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, విద్యార్థి, కుల, కార్మిక, కర్షక సంఘాలు, ఉద్యోగులు..ఇలా ఎవరికివారు ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు ముందుకొస్తున్నారు.

సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారి ఇళ్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు.

అయితే శుక్రవారం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), బొడ్డేపల్లి సత్యవతి (ఆమదాలవలస), జుత్తు జగన్నాయుకులు (పలాస), కొర్ల భారతి (టెక్కలి), మీసాల నీలకంఠంనాయుడు (ఎచ్చెర్ల), పీరుకట్ల విశ్వప్రసాద్ (ఎమ్మెల్సీ) సమైక్యాంధ్ర ఉద్యమంలో 'మేము సైతం!' అంటూ రాజీనామా చేసారు.

వెబ్దునియా పై చదవండి