రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మరోమారు నోరు పారేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి పిచ్చోడిలా నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు. యుద్ధంలో గెలవాలంటే పంచపాండవుల వెంట ఉండాల్సిందేనంటూ మంగళవారం గాంధీభవన్లో జరిగిన క్విట్ ఇండియా డేలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేకే మండిపడ్డారు.
ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఉంటాడని తాను భావించడం లేదన్నారు. ఒకవేళ అదే విధంగా మాట్లాడివుంటే సీఎం కంటే పిచ్చోడు మరొకరు లేరని మండిపడ్డారు. ఆయన యుద్ధం కావాలంటున్నారు. యుద్ధం ప్రకటించేందుకు, పోరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ధర్మ యుద్ధంలో కౌరవులు, పాండవులు ఎవరో తెల్చుకుందామని కేకే సవాల్ విసిరారు.