గుండెపోటుతో మరణించిన పౌర హక్కుల సంఘం నేత, ప్రముఖ న్యాయవాది డాక్టర్ కె.బాలగోపాల్ అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పంజాగట్టలో హిందూ శ్మశానవాటికలో జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పౌరహక్కుల ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వారిలో బాలగోపాల్ ఒకరు. అనంతపురం జిల్లా రాళ్ళ అనంతరపురంలో జన్మించిన ఈయన.. నక్సల్ బరి ఉద్యమానికి ఎందరో సైనిక వీరులను అందించారు.
ముఖ్యంగా సింగరేణి కార్మిక సమాఖ్య తరపున కొంతకాలం పాటు ఉద్యమాన్ని కూడా నడిపిన ఘనత బాలగోపాల్ జీవిత చరిత్రలో ఉంది. ఆరంభంలో నక్సల్పై మోపిన అనేక కేసులను వాదిస్తూ వచ్చిన ఆయన.. మారిన కాలమాన పరిస్థితుల వల్ల కొంతకాలంగా ఉద్యమ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఇదిలావుండగా, బాలగోపాల్ అంతిమయాత్ర మెహిదీపట్నం శివారు గుడిమల్కాపూర్ ప్రియా కాలనీలోని ఆయన నివాసం నుంచి ఆరంభమవుతుంది. బాలగోపాల్ పార్ధివ శరీరం చివరి చూపు కోసం ఆయన అభిమానులు, పౌర ఉద్యమనేతలు, కార్యకర్తలు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.