ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

ప్రజారాజ్యం పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు చేరారు. ఆయన అనుచరగణంతో గురువారం మధ్యాహ్నం హైదరబాద్‌లోని పీఆర్పీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు. యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ల సమక్షంలో ఆయన పీఆర్పీ సభ్యత్వం తీసుకున్నారు.

గత కొంతకాలంగా జ్యేష్ట పీఆర్పీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలకు గురువారంతో తెరపడింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జ్యేష్ట ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు విజయానికి విశేష కృషి చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో వచ్చిన విభేదాల మేరకు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ మైలవరం నియోజకవర్గం వచ్చినప్పుడు జ్యేష్టను కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించడం, సమ్మతించడం అన్నీ చకచకా సాగిపోయాయి. పీఆర్పీ విధానాలు, సామాజిక న్యాయం తదితర అంశాలు తననెంతగానో నచ్చాయని అందువల్లే పీఆర్పీలో చేరినట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి