బాబు జిమ్మిక్కులను నమ్మబోరు : పురంధరేశ్వరి

అవినీతి అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలెవరూ నమ్మబోరని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శ్రీమతి పురంధరేశ్వరి విమర్శించారు.

వంద కోట్ల రూపాయల ఖర్చుతో తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం పురంధరేశ్వరి ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కారంచేడులోని ఆమె స్వగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని పురంధరేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అవినీతి అంటూ పదే పదే చేస్తోన్న రాద్ధాంతాలను ప్రజలెవరూ పట్టించుకోవటం లేదని ఆమె చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన ఫైలు లా కమీషన్, హ్యూమన్ రిసోర్స్ మంత్రిత్వ శాఖల వద్ద ఉందని... చివరి సమావేశాల సమయంలో ఆ ఫైలు రానందువల్లనే పార్లమెంటులో ప్రవేశపెట్టలేక పోయామని పురంధరేశ్వరి వివరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనతో పలుమార్లు చర్చించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, రాబోయే ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకే పోటీ చేస్తానని పురంధరేశ్వరి స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి