భాగ్యనగరిలో కాంగ్రెస్ కూటమి: రంగారెడ్డిలో తెదేపా

సోమవారం, 10 మే 2010 (11:00 IST)
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరొకటి మజ్లిస్ పార్టీలు వశం చేసుకున్నాయి. అలాగే, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

హైదరాబాద్, రంగారెడ్డి స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం పూర్తయింది. హైదరాబాద్‌లో అధికార కాంగ్రెస్‌కు చెందిన ఎంఎస్.ప్రభాకరరావు, మజ్లీస్ పార్టీకి చెందిన సయ్యద్ అమీన్ హసన్ జాఫ్రీ శాసన మండలికి ఎన్నికయ్యారు. మొత్తం 69 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్‌, మజ్లీసులకు 55 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే వచ్చింది. మరో రెండు ఓట్లు చెల్లలేదు.

ఇదిలావుండగా, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానంలో తెదేపా అభ్యర్థి ఏ.నరేందర్ రెడ్డి విజయం సాధించారు. నరేందర్‌కు 341 ఓట్లు పోలు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి, మన పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు 292 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటు చెల్లలేదు.

వెబ్దునియా పై చదవండి