మొద్దుశీను శవపరీక్ష ఓ బూటకం: తెదేపా

అనంతపురం జిల్లా కారాగారంలో దారుణ హత్యకు గురైన మొద్దుశీను మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష కేవలం బూటకమని ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తలపై తగిలిన బలమైన గాయం వల్లనే మొద్దు శీను మృతి చెందినట్లు డాక్టర్‌ ప్రభాకర్‌ ఇచ్చిన నివేదికను ఇటు తెదేపా నేతలు తప్పుపట్టారు. అలాగే.. హతుని భార్య రాజ్యలక్ష్మీతో పాటు.. బంధువులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అందువల్ల మొద్దుశీను మృతదేహానికి జడ్జి, మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మృతుల బంధువులతో పాటు తెదేపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా శవంతో వారు గుంటూరులో ధర్నా నిర్వహించారు. దీంతో గుంటూరు - నరసరావుపేట రహదారిలో కొద్ది సేపు వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

ఇదిలావుండగా మొద్దుశీను హత్యను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఎదురుదాడికి దిగారు. హంతకుని సంబంధీకులంతా తెదేపా వారేనంటూ వైఎస్సార్ ఆరోపించారు. అందువల్లే ఒక హంతకుని హత్యపై ఇంత రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి