రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు: ఏ గ్రూపు గెలుస్తుందో!?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (11:32 IST)
FILE
రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు రోజు రోజుకి ముదిరి పాకానపడుతున్నాయి. సీఎం వర్గం, డీఎల్ వర్గం అంటూ రెండు గ్రూపులుగా విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రా రెడ్డి గ్రూపుపై ఆధిపత్యం చెలాయించేందుకు సీఎం కిరణ్ గ్రూపు పావులు కదుపుతోంది.

ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైయ్యారని, రాష్ట్రంలో ఏవేవో జరుగుతున్నాయని డీఎల్ వ్యాఖ్యానించారు. అలాగే తన సామాజిక వర్గానికి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను కావాలనే సిండికేట్ వ్యవహారంలో ఇరికించారని డీఎల్ మండిపడ్డారు.

మీడియాతో డీఎల్ వ్యాఖ్యానించిన వీడియోలను సీఎం కిరణ్ గ్రూపు ఇప్పటికే అధిష్టానానికి చేరవేసింది. అలాగే వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని డీఎల్ నీరు గార్చిన విధానాన్ని కూడా కిరణ్ కుమార్ అధిష్టానానికి తెలియజేసింది.

అయితే సీఎం వర్గానికి తగిన కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు డీఎల్ గ్రూపు సమాయత్తమవుతోంది. సీఎంతో ఢీ అంటే ఢీ అంటూనే డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తన శాఖలో కోతపై ఇప్పటికే సీఎం కిరణ్‌పై గుర్రుగా ఉన్న డీఎల్ , సీఎంకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు సీఎం కిరణ్ తన సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి ఇరికించారని డీఎల్ ప్రత్యక్షంగా విమర్శలు చేశారు.

కాగా సీఎంపై విమర్శలతో మాత్రమే ఆగిపోకుండా.. సీఎం పనితీరు, సంక్షేమ పథకాల అమలులో గల అవకతవకలను యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి ఓ లేఖ పంపారని తెలుస్తోంది. మరి.. కాంగ్రెస్ గ్రూపు తగాదాలకు ఆ పార్టీ అధిష్టానం ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సిందే...!

వెబ్దునియా పై చదవండి