వరద పరిస్థితిపై అధికారులతో మన్మోహన్ సమీక్ష

గురువారం, 8 అక్టోబరు 2009 (11:12 IST)
రాష్ట్రంలో అపార నష్టం కలిగించిన వరద తాకిడిపై ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏరియల్ సర్వే పూర్తి చేసిన తర్వాత ఆయన హైదారాబాద్‌లో ఈ సమీక్షా సమావేశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలావుండగా, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రధాని శుక్రవారం రాష్ట్రానికి రానున్న విషయం తెల్సిందే. అయితే, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. శుక్రవారం ఉదయం 11.10 నిమిషాలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు.

అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం 12.45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ వరద సృష్టించిన బీభత్సంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌ నుంచి మళ్లీ బయలుదేరి కర్నూలు, మహబూబ్‌నగర్, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, సాయంత్రం 5.20 నిమిషాలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రధాని మన్మోహన్ వెంట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జయపాల్ రెడ్డి కూడా ఉంటారు.

వెబ్దునియా పై చదవండి