వారిద్దరి వ్యాఖ్యలు బాధించాయి: చిరంజీవి

FileFILE
తమ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజాపై చేసిన వ్యక్తిగత విమర్శలు, సినీనటి రోజా తన కుటుంబంపై చేసిన విమర్శలు తమను ఎంతగానే బాధించాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ శోభారాణి అలా మాట్లాడివుండాల్సింది కాదన్నారు.

అయితే, తమపై ఆది నుంచి ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శల వల్లే ఆమె అలా వ్యక్తిగత విమర్శలకు దిగారన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విమర్శలు, తనను, తన కుటుంబ సభ్యులను ఎంతగానో బాధించాయన్నారు.

అయినా, తాము ఏనాడు ప్రతి విమర్శలు చేయలేదన్నారు. కారణం.. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో వచ్చామని, ఆ దిశగా ముందుకు సాగుతున్నామని, అందుకే ఎవరు కూడా నోరు విప్పలేదన్నారు. అంతేకానీ, తమకు చేతగాక కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

అయితే, ఈ ఆరోపణలు హద్దులు దాటడం వల్లే తమ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి ప్రత్యర్థిపై విమర్శలు చేశారన్నారు. వీటిని తాము సమర్థించడం లేదన్నారు. అందుకే ఆమెను ఫోనులో మందలించినట్టు చెప్పారు. అంతేకాకుండా, తొలుత తమపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారు క్షమాపణ చెపితే శోభారాణితో క్షమాపణలు చెప్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి