వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కోవర్టు కేవీపీ : హనుమంతరావు

గురువారం, 6 సెప్టెంబరు 2012 (11:04 IST)
File
FILE
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి పక్కా కోవర్టుగా వైఎస్ఆర్ ఆత్మబంధువు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయనతో కాంగ్రెస్ నేతలకు ఉన్న సత్‌ సంబంధాలను తెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పిలుపునిచ్చారు.

దీనిపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అన్ని అక్రమాలకు సూత్రధారి కేవీపీనేని ఆరోపించారు. అందుకే.. జగన్ కొత్త పార్టీ పెట్టినప్పటికీ కేవీపీ ఆ పార్టీ వైపు వెళ్లకుండా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే జగన్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండి అన్ని విధాలా సహాయం చేసేలా జగన్, కేపీవీల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కేవీపీ చివరికి ఎక్కడ తేలతారోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు ఉపయోగపడేలా, వైకాపాకు అనుకూలించేలా కేవీపీ నిర్ణయాలు, అడుగులు, కదలికలు ఉన్నాయని వీహెచ్ ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి