కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్నది బలం కాదని, బలుపు మీద వాపు అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానాన్ని జగన్ ఎపుడైతే ధిక్కరించాడో అపుడే.. అతని రాజకీయ జీవితం పతనం ఆరంభమైందన్నారు.
ప్రస్తుతం జగన్కు ఉన్నది ప్రజాబలం కాదన్నారు. వ్యాధిగ్రస్తునిలో కనిపించే వాపుమీద బలుపు అని ఆయన ఎద్దేవా చేశారు. గత నెలలో అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ఓదార్పు యాత్రను ఒక నెల రోజుల పాటు వాయిదా వేసుకోవడం వల్ల జగన్.. అధిష్టానం దృష్టిలో పడ్డారన్నారు. ఆ ఒక్క సంఘటనతో జగన్ క్రెడిట్ హైకమాండ్ అకౌంట్లో బాగా పెరిగిందన్నారు.
ప్రస్తుతం పార్టీ అధినేత్రి సోనియా మాటను కాదని ఓదార్పు యాత్రను చేపట్టడం వల్ల అకౌంట్లో ఉన్న క్రెడిట్ కాస్త డెబిట్ అయిపోయిందన్నారు. ఇది పూర్తిగా కరిగిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ఆయనకు కష్టాలు తప్పవని శంకర్ రావు జోస్యం చెప్పారు.