సాక్షి ఖాతాల స్తంభన కేసు : 14కు తుది తీర్పు వాయిదా
గురువారం, 10 మే 2012 (15:08 IST)
File
FILE
సాక్షి మీడియా గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాలను సీబీఐ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసి పిటిషన్పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం వాదోపవాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసు వాదనల సమయంలో సాక్షి తరపు న్యాయవాది వాదిస్తూ.. దేశ వ్యాప్తంగా సంచలనమైన 2జీ స్పెక్ట్రమ్ కేసులో కూడా సీబీఐ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో సీబీఐ ఉద్దేశపూర్వకంగా ఖాతాలను నిలిపివేసిందని తెలిపారు.
సరైన కారణం చూపకుండా ఖాతాలను నిలిపివేశారన్నారు. జగతి పబ్లికేషన్ అనేది వ్యక్తిగత సంస్థ కాదని, ఇందులో అనేక మంది షేర్హోల్డర్స్ ఉన్నారని కోర్టుకు వివరించారు. ఇందిరా టెలివిజన్పై ఎటువంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారని కోర్టుకు తెలిపారు.
ఈ సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన కారణంగా వేలాది ఉద్యోగులు ఇబ్బందులు పడవలసి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న కోర్టు తుది తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేసింది.