వైకాపా నేత గంజి ప్రసాద్ హత్య కేసు: ఆరుగురి అరెస్టు

బుధవారం, 4 మే 2022 (18:04 IST)
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి మండలం గోపాలపురం గ్రామంలో వైకాపా నేత గంజి ప్రసాద్ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఇటీవల ఏపీలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు హస్తమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేపై గంజి ప్రసాద్ అనుచరులు, గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడి పెను సంచలనంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసులో సంబంధం ఉన్నవారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. గంజి ప్రసాద్ హత్యకేసులో ముగ్గురు స్వయంగా పాలుపంచుకోగా, వారిని బజారయ్య అనే వ్యక్తి ప్రోత్సహించారని జిల్లా ఎస్పీ తెలిపారు. దీంతో బజారయ్యతో పాటు సురేశ్, మోహన్ కుమార్, హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణలను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. గంజి ప్రసాద్ రాకపోకలపై గంజి నాగార్జున రెక్కీ నిర్వహించగా, సురేశ్, హేమంత్‌లు గంజి ప్రసాద్‌పై బైకుపై వెంబడించి హత్య చేశారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు