విశాఖలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి : హత్యనా?... ఆత్మహత్యనా?

సోమవారం, 25 జులై 2016 (10:28 IST)
విశాఖపట్టణంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే, ఈ విద్యార్థిని హత్య చేశారా.. లేక ఆత్మహత్యనా అనే అనే అంశంపై కలకలం రేగుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్నానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తనూజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిండ్రులు అర్థరాత్రి దాకా వెదికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు తనూజ కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక భాగంలోని చెత్త కుప్పల్లో విగత జీవిగా పడి ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తనూజతో సన్నిహితంగా మెలగుతున్న దిలీప్ అనే బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 
ఈవ్ టీజింగ్ ఆరోపణలపై తల్లితో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో శనివారం రాత్రి 8.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ తెల్లారేసరికి శవమై కనిపించిన తీరు విశాఖలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ కేసు మిస్టరీ పెను సవాలునే విసురుతోంది. 

వెబ్దునియా పై చదవండి