ప్రేమించలేదనీ యువతి గొంతు కోసిన ఆటో డ్రైవర్ :: ప్రేమ జంట సూసైడ్

శుక్రవారం, 8 మే 2020 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న అక్కసుతో ఆటోడ్రైవర్ ఒకరు ఓ యువతి గొంతు కోశాడు. ఆ తర్వాత ఆ ఆటోడ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే స్కూలులో పదో తరగతి చదువుతోంది. 
 
తనను ప్రేమించాలంటూ ఆ విద్యార్థిని వెంట ఓ ఆటోడ్రైవర్ వెంటపడుతూ వచ్చాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆ యువతిపై పగను పెంచుకున్న ఆటో డ్రైవర్ కత్తితో ఆ యువతి గొంతుకోశాడు. 
 
ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు ఆ బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి, పోలీసులు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 
 
ప్రేమ జంట ఆత్మహత్య 
మరోవైపు, తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం కంపూర్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒకరినొకరు ఇష్టపడిన ఆ ప్రేమజంట తమ ప్రేమ వ్యవహారం విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారుకూడా సమ్మతించి నిశ్చితార్థం కూడా జరిపారు. అయితే, లాక్డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదాపడింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమికులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు కన్నాపూర్‌కు చెందిన గణేశ్, కంపూర్‌కు చెందిన సీతా బాయిగా గుర్తించినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు