నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించే ప్రాంతంగా తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని శనివారం పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తుళ్లూరుకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఇక అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం వుంది. విజయవాడకు 25 కిలోమీటర్లు, గుంటూరుకు 33 కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే, జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరికి ఇది కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఉందన్నారు.