కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఏపీదే అగ్రస్థానం.. జగన్ అదరగొట్టేశారుగా!

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:11 IST)
ప్రపంచ దేశాలను కరోనా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై ఏపీని సీఎం జగన్ అగ్రస్థానంలో నిలబెట్టారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తూ, ఈ మహమ్మారి చైన్‌ను తెంచడంలో విజయం సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం దక్కింది. ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. కేరళ రెండో స్థానంలో నిలిచింది.
 
మహమ్మారిని తరిమికొట్టేందుకు ఏపీలో తీసుకుంటున్న చర్యలకు అన్ని రాష్ట్రాలు ఫిదా అవుతున్నాయి. కరోనాకు మందు లేదని, లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పదేపదే ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఆ రెండింటిని ఏపీలో పకడ్బందీగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ముందు వరుసలో నిలిచారు.
 
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే ఏపీలో వైరస్ అదుపులో ఉందని ఎన్డీటీవీ పేర్కొంది. కరోనా వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ఆ సంస్థ ప్రశంసింది. ఈ మేరకు ఎన్డీ టీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 
ముఖ్యంగా ప్రజల్లో మానసిక ధైర్యం కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దాదాపుగా ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ప్రజల అందరికీ మాస్కులను పంపిణీ చేస్తున్నారు. 
 
ఇక మరొక విషయం గురించి చెప్పుకోవాలి.. దేశంలోనే ఎవరూ చేయలేనటువంటి పనిని ముఖ్యమంత్రి జగన్ చేశారని చెప్పొచ్చు. ఏపీలోనే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం జగన్‌కు మాత్రమే దక్కిందని చెప్పొచ్చు.
 
ఇకపోతే.. ఏపీలో సోమవారం కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 432కి చేరింది. ఇప్పటివరకు 12 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఏడుగురు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు