హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పంచ్లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు బేజారావుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆయనను సాగనంపేవరకు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమచారం. కేబినేట్ విస్తరణ విషయాన్ని గవర్నర్ వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తే... ఆయన తనదైన శైలిలో పంచ్లు విసిరినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చాలాకాలంగా చూస్తున్నారు. అయిదారుగురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తగా 8 నుంచి 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ఉన్నారు. దసరా సందర్భంగా ఈ విస్తరణ ఉంటుందని అందరూ ఊహిస్తూ వచ్చారు. దీనితో మంత్రి పదవుల పందేరంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. చంద్రబాబు కూడా వైసీపీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జ్యోతుల నెహ్రూ, అమర్నాధరెడ్డి, సుజయ్ కృష్ణ, జలీల్ ఖాన్ వంటి వారికి బెర్త్ కల్పించాలని ఆలోచన చేశారు. ఇక టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కోడెల శివప్రసాదరావు, శ్రీరాం రత్తయ్య, అనితలతో పాటు నారా లోకేష్ లకు స్థానం కల్పించాలని భావించారు.
ఇదే విషయాన్ని గవర్నర్తో ప్రస్తావించగా, ఆయన పంచ్ సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్కు వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలంగాణా మంత్రి పదవిపై పెద్ద యాగీ చేసిన మీరు... ఇపుడు వైసీపీ వారికి ఎలా మంత్రి పదవులు ఇస్తారని గవర్నర్ పంచ్ వేసినట్లు సమాచారం. దీనిపై మీ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో వేసిన కేసు ఇంకా పెండింగ్లో ఉందని ఆయన గుర్తుచేసినట్లు తెలుస్తోంది. ఇపుడు వారంతా టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యేలు... వారిని తీసుకుంటే రాజకీయ సంక్షోభం వస్తుందని కూడా అన్నట్లు సమాచారం.
గవర్నర్ పంచ్లతో చంద్రబాబు ఇరుకున పడినట్లయింది. ఇక ఈయన ఉండగా, తాను ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందని భావిస్తున్నట్లు సమచారం. ఎన్.డి.ఎ. భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఇక కొత్త గవర్నర్ను తెచ్చుకుంటే గాని మనలేమనే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పరిణామాలు... చంద్రబాబు ఉద్వాసన పలుకుదామని అనుకుంటున్న మంత్రులు సిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాధ రెడ్డిలకు రిలీఫ్గా మారింది.