జర్నలిస్టులకు ఏపీ ప్రెస్ అకాడమీ ఆన్ లైన్ శిక్షణా తరగతులు

శనివారం, 10 అక్టోబరు 2020 (23:19 IST)
గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యతను మెరుగు పరిచే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జిల్లాల వారీగా వరుస శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. అక్టోబర్ 10 వ తేదిన కడప జిల్లా జర్నలిస్టులకు ఆన్ లైన్ విధానంలో శిక్షణ తరగతులను నిర్వహించారు.

ఈ ప్రారంభోత్సవ ఉపన్యాస కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రారంభోపన్యాసం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్, కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ లు పాల్గొని సమాజంలో జర్నలిస్టుల ప్రాధాన్యత, వారి వృత్తి నిబధ్ధతపై ప్రసంగించారు.

ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, బివి ప్రసాద్ లు వివిధ అంశాలపై కడప జిల్లా జర్నలిస్టులతో వారి అనుభవాలను పంచుకొంటూ వివిధ అంశాలపై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమ సమన్వయ కర్తగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణా రెడ్డి వ్యవహారించారు.
 
ఈ సంధర్బంగా ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో  జర్నలిస్టుల కృషిని అభినందించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ పోటా పోటీగా వెళ్లే క్రమంలో నిజమైన వార్తల్ని నిర్ధారించుకొని జర్నలిస్టులు సరైన వార్తలను అందించాలని  కోరారు. జర్నలిస్టులకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ప్రెస్ అకాడమీని ఇందులో పాల్గొన్న జర్నలిస్టులను ఆయన అభినందించారు. 
 
ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ గ్రామీణ విళేఖరులకు తమకు కావాల్సిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. మీడియా ఒక వ్యాపార,రాజకీయ,కుల, వర్గాలుగా మారిపోతూ నైతిక విలువల్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాకుండా జర్నలిస్టులు వ్యవహారించాలని ఆయన అన్నారు. చిన్న పత్రికలకు కూడ తాము ప్రాధాన్యత ఇచ్చి అండంగా వుంటామని తెలిపారు.

ఇటీవల సోషల్ మీడియా పేరుతో ఇంటర్నెట్ లో తప్పుుడు వార్తలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రజల్లో మీడియా రంగంపై విశ్వనీయతను పెంచే విధంగా నకిలీ వార్తలకు అడ్గుకట్ట వేయాలని ఆయన అన్నారు.
 
కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌళిక సదుపాయాలు వారి సమస్యలపై ఎక్కువ దృష్టి పెడితే ప్రజల సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు భాగస్వాములవుతారని ఆయన అన్నారు. పరిశోధనాత్మిక పాత్రికేయ (ఇన్విస్టిగేషన్) జర్నలిజంపై ఎక్కువ దృష్టి సారిస్తే అవినీతి రహిత సమాజంగా తీర్చిదిద్దవచ్చని చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎపీ ప్రెస్ అకాడమీని ఆయన అభినందించారు. వార్తలు రాసే క్రమంలో వాటిని పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాలని జర్నలిస్టులను కోరారు.
 
ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, బివి ప్రసాద్ లు జర్నలిజంలో  నైతిక విలువలు, వృత్తి నైపుణ్యతను ఎలా పెంచుకోవాలి అన్న అంశాలపై శిక్షణ తరగతుల్లో చర్చించారు. చట్టబధ్దంగా సమాచారా హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ పూర్తి ఆధారాలతో వార్తలను ఎలా సేకరించాలి. నకిలీ వార్తలను ఎలా పసిగట్టాలి అన్న అంశాలను తెలియచేసారు.
 
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ జర్నలిజంలో  మెళకువలు తెలియచేసే క్రమంలో ప్రెస్ అకాడమీ గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని అన్నారు. కరోనా నేపధ్యంలో ఎపిలో అన్ని జిల్లాల వారీగా ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ తరగుతులు ఏర్పాటు చేస్తున్నామని  తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృధ్ధిలో భాగంగా జర్నలిస్టుల పాత్ర ఎలా వుంటుదన్న విషయంపై స్వయంగా తన అనుభవాలను తెలియచేసారు. జర్నలిస్టుల అభివృధ్ధి కోసం ప్రెస్ అకాడమీ పలు రకాల కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన అన్నారు. 
 
కడప జిల్లా జర్నలిస్టులు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు