వైకాపా నేత భూమా నాగిరెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న సండ్ర వీరయ్యపై కేసు ఉన్నప్పటికీ ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి పంపిన టీడీపీ నేతలు, తన తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి, షుగరు, బీపీ ఉన్నాయని చెప్పినా నిమ్స్కు తరలించలేదని ఫైర్ అయ్యారు.
తన తండ్రి జైలులో నిరాహార దీక్ష చేపట్టారని ఆయనకు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తాను ఓటేయడానికి వెళ్లినప్పుడు అడ్డుకున్న పోలీసులు, ఓటేశాక వెళ్లిపొమని ఇబ్బంది పెట్టారని... దానిని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శాసనసభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.