పడగవిప్పిన ఫ్యాక్షనిజం: వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి

మంగళవారం, 22 జులై 2014 (12:33 IST)
అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పింది. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో వైఎస్సార్సీపీ కార్యకర్త రంగయ్యనాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
రంగయ్యనాయుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్యనాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
మరోవైపు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడిచేశారు. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో వైసీపీ కార్యకర్త నాగిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. శత్రువులు గొడ్డళ్లతో నరకడంతో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి