భూమా నాగిరెడ్డి ఇకలేరు... పత్రిక కార్యకర్తలతో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు..

ఆదివారం, 12 మార్చి 2017 (12:45 IST)
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ గుర్తింపు కలిగిన రాజకీయ నేత భూమా నాగిరెడ్డి ఇకలేరు. ఆదివారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 54 యేళ్లు. ఆదివారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారితో మాట్లాడుతూ ఉండగానే కుప్పకూలి పోయారు. ఆ వెంటనే ఆయనను హుటాహుటిన ఆళ్ళగడ్డ ఆస్పత్రికి కార్యకర్తలు, నేతలు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్సకు ఏమాత్రం స్పందించక పోవడంతో భూమా మరణించినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన భార్య శోభా నాగిరెడ్డి మృతిచెందారు. భూమా నాగిరెడ్డి అకాల మృతితో ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భూమా నాగిరెడ్డికి గతంలో గుండెపోటు రావడంతో బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. వారంరోజుల క్రితం మరోసారి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి