స్నేహితురాలు కంటిపై గుద్దింది.. కంటిపై రెప్పలోని నరం చిట్లింది.. కంటి నుంచి ధారగా రక్తం!

గురువారం, 7 జులై 2016 (10:10 IST)
స్నేహితురాలు కంటిపై గుద్దింది.. అంతే ఆ అమ్మాయి కంటిపై రెప్పలోని నరం చిట్లింది. అంతే కంటి నుంచి రక్తం ధారగా వస్తూనే ఉంది. ఈ ఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన ముమ్మిడి మధుబాల స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 
 
మంగళవారం సాయంత్రం మధుబాల ఇంట్లో కూర్చుని చదువుకుంటుండగా ఒక్కసారిగా ఆమె ఎడమ కంటి నుంచి ఏకధాటిగా రక్తం రావడం ప్రారంభమైంది. ఎంత ప్రయత్నించినా రక్తమాగలేదు. రక్తం ధారలుగా రావడంతో కంగారు పడిన మధుబాల తల్లిదండ్రులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. 
 
ఆ డాక్టర్లు మధుబాల కంటికి మందులు, ఐ డ్రాప్స్‌ ఇచ్చి పంపేశారు. అవి వేసుకున్నా.. కంటి నుంచి రక్తం ధారలుగా రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించడంలో కంటిపై రెప్పలోని నరం చిట్లినట్లు గుర్తించారు. ఇందుకు తగిన చికిత్స కోసం వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి