తన ఇలాకాలోని ఒక ఏటీఎం కేంద్రం ముందు చెత్త ఉండటాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో కోపాన్ని నిగ్రహించుకోలేక.. ఏటీఎం సెంటర్కు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మహిళా బ్యాంకు మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లి.. తాళాలు ఇవ్వాలని కోరింది. అంతే.. ఆమెపై ఒంటికాలిపై లేచిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తిట్లు, బూతు పురాణం అందుకున్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ వివరాలను పరిశీలిస్తే.. మూడు రోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.