ఫేమ్ ఇండియా కింద ఏపీకి 350 ఎలక్ట్రిక్ బస్సులు

మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:13 IST)
"ఫేమ్ ఇండియా పథకం" కింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల, బ్యాటరీల తయారీలోనూ ఎవరికి అవకాశం ఇచ్చారని కూడా ప్రశ్నించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కు ఫేమ్ ఇండియా పథకం కింద 2015లో 40 ఎలక్ట్రిక్ బస్సులు, రెండో విడత (2019 ఏప్రిల్ 1) 350 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో విశాఖపట్నానికి 100, విజయవాడకు 50, అమరావతికి 50, తిరుపతికి50, కాకినాడకు 50, తిరుపతి అంతర్గత రవాణాకు 50 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. 
 
 
దీనికిగాను పది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రత్యేక పథకం కింద ఈ ఏడాది మే 12న కేంద్ర క్యాబినెట్ ఉత్పాదకత తో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ)ను ఆమోదించినట్లు తెలిపారు. ఇప్పటికే వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అనుబంధంగా ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు గాను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకుగాను 18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. (అడ్వాన్సు ఆటోమేటిక్ ప్రొడక్షన్) ప్రత్యేక వాహనాల ఉత్పత్తి పథకం కింద 25,1935 వేల కోట్ల రూపాయలను రానున్న ఐదేళ్ల కోసం కేటాయించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు