ఆ రైతులు ధరలు పెరిగాక భూములు అమ్మరని గ్యారెంటీనా... పవన్ చర్చపై బాబు

గురువారం, 5 మార్చి 2015 (14:45 IST)
పవన్ కళ్యాణ్ ఎదుట తమ భూములను ఇచ్చేది లేదంటూ తమ అభిప్రాయాలను చెప్పిన రైతుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధాని పరిధిలో ఉన్న రైతుల భూములను తీసుకోవడం వారి మేలు కోసమే అని అన్నారు. ఐతే కొంతమంది రైతులు భూములు ఇవ్వక పోవడానికి కారణం... వారు వ్యవసాయం చేయడానికి కాదనీ, రాజధాని నగరం నిర్మించాక ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయి కనుక అప్పుడు అమ్ముకోవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు భూములు ఇవ్వనని మొరాయిస్తున్న రైతులంతా తమ జీవితాంతం అక్కడ వ్యవసాయమే చేస్తామని చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
ఇప్పటికే 80 శాతానికి పైగా రైతులు తమతమ భూములను స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. వారంతా ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తే తమకు లాభం చేకూరుతుందని భావిస్తూ అలా చేశారని వెల్లడించారు. మిగిలినవారు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలన్నారు. పార్టీలు కూడా దూరదృష్టితో ఆలోచన చేయాలని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు.

వెబ్దునియా పై చదవండి