అదుగో చిరుత... తిరుమలలో అర్థరాత్రి కలకలం.. భయంతో భక్తుల పరుగులు

మంగళవారం, 26 జులై 2016 (11:36 IST)
తిరుమలలో అర్థరాత్రి చిరుత భక్తులను హడలెత్తించింది. పద్మావతినగర్‌లోని నర్సింగ్‌ సదన్‌ విశ్రాంతి గృహంలోకి ఒక చిరుత ప్రవేశించింది. నర్సింగ్‌ సదన్‌ వెనుకే అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత వచ్చినట్లు అటవీశాఖాధికారులు చెబుతున్నారు. నర్సింగ్‌ సదన్‌లోని మొదటి అంతస్తులోకి చిరుత ప్రవేశించింది. 
 
చిరుతను చూసిన అక్కడ పనిచేసే సిబ్బంది వెంకటేష్‌, ప్రభాకర్‌లు రెండవ అంతస్తుకు పరుగులు తీశారు. వీరిద్దరు భవనంపైకి ఎక్కి మరొక భవనంపై ఎక్కి కిందకు దిగి తితిదే, అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ, అగ్నిమాపక, తితిదే విజిలెన్స్, పోలీసు శాఖలు రంగగంలోకి దిగి మంగళవారం తెల్లవారుజాము వరకు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు.
 
అయితే చిరుత నర్సింగ్‌ సదన్‌ నుంచి మెల్లగా తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. చిరుత ఉందన్న విషయం తెలుసుకున్న నర్సింగ్‌ సదన్‌లో గదులు అద్దెకు తీసుకున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే అటవీశాఖాధికారులు వారికే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చిరుత అటవీప్రాంతంలోకి వెళ్ళిపోయిందని తెలుసుకున్న భక్తులు వూపిరి పీల్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి