సీఐ భార్య మృతి... మా అమ్మను మా నాన్నే చంపేసుంటాడు... సీఐ పిల్లలు...

బుధవారం, 28 జనవరి 2015 (13:20 IST)
అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ భార్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను భర్త సీఐ ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటాడని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.
 
సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై అనుమానాలు ముసురుకున్నాయి. కాగా మంగళవారం అర్థరాత్రి సీఐ దంపతులపైకి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సీఐ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందారు.
 
కడప పీటీసీ సీఐగా పనిచేస్తున్న అర్జున్‌ నాయక్ స్వస్థలం నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి. కాగా ఆయన మంగళవారం భార్య పద్మ(39)తో కలిసి తన స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేయించారు. కంది పంటను ఎండబెట్టి రాత్రి వరకూ అక్కడే నూర్పిడి చేయించి అక్కడే భోజనం చేసి నిద్రించారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది.

వెబ్దునియా పై చదవండి