ప్రతి బిడ్డకు శ్రీరామరక్ష.. అమ్మఒడి పథకం : సీఎం వైఎస్ జగన్

సోమవారం, 11 జనవరి 2021 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో భాగంగా సోమవారం రెండో విడత చెల్లింపులను సీఎం జగన్ ప్రారంభించారు. సోమవారం నెల్లూరు జిల్లా వచ్చిన సీఎం జగన్ ఇక్కడి వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రెండో విడత అమ్మఒడిలో భాగంగా రూ.6,673 కోట్లను విడుదల చేశారు. మొత్తం 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమచేశారు.
 
దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ, తమ పిల్లలను చదివించే శక్తి లేక చాలా మంది తల్లులు వారిని కూలి పనులకు పంపడాన్ని పాదయాత్రలో చూశానని, అందుకే అమ్మఒడికి రూపకల్పన చేశామని వెల్లడించారు. 
 
అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15 వేలు ఇచ్చామని, ఇప్పుడు రెండో విడత అమలు చేస్తున్నామని వివరించారు. చదువుకోవాలనుకునే ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ పథకంలో భాగంగా 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థికసాయం అందిస్తారు.
 
తన పాద యాత్ర సమయంలో..  చదివించే స్తోమత లేక తమ పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులను నా పాదయాత్రలో చూశా. అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించాం. వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. 
 
నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.
 
అంతకాకుండా, గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్‌.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్‌ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు.
 
పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు