కోల్‌ స్కామ్ : దాసరికి ఈడీ సమన్లు.. అరెస్టు తప్పదా?

బుధవారం, 26 నవంబరు 2014 (11:43 IST)
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ టాలీవుడ్ దర్శకుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది. బొగ్గు కుంభకోణం విచారణలో భాగంగా దాసరికి సమన్లు జారీ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న బొగ్గు కుంభకోణంలో పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో దాసరి నారాయణరావు బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు మంత్రులుగా పని చేసిన మంత్రుల వద్ద ఎందుకు ప్రశ్నించలేదని సీబీఐను నిలదీసిన విషయం తెల్సిందే. 
 
దీంతో కదిలిన సీబీఐ, ఈడీలు.. దాసరి నారాయణ రావుకు ఆగమేఘాలపై నోటీసులు జారీ చేశాయి. కాగా, ఇదే కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను సైతం విచారించే అవకాశం లేకపోలేదని సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి