మీరెక్కడ పతివ్రతలో చెప్పండి... సీఆర్‌సీ మాటలపై మండలిలో రభస

బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:43 IST)
ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రయ్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీరేం ప్రతివ్రతలా అంటూ తెలుగుదేశం సభ్యులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. టీడీపీ సభ్యురాలు ప్రతిభాభారతి దీనిపై రామచంద్రయ్య క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కరువుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మీరంతా పతివ్రతలా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ మహిళా సభ్యులు తీవ్రంగా ఖండించారు. ‘‘నిండు సభలో అనుచిత వ్యాఖ్యలతో ఆడవాళ్లను అవమానిస్తారా? తక్షణమే క్షమాపణ చెప్పాలి’’ అని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి డిమాండ్‌ చేశారు. 
 
క్షమాపణ చెప్పేవరకు సభ జరగనివ్వబోమని ఆమె స్పష్టం చేశారు. అయితే.. రామచంద్రయ్య తన పార్టీ సభ్యులను తీసుకుని మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో గందరగోళం సద్దుమణిగి కరువుపై చర్చ కొనసాగింది.

వెబ్దునియా పై చదవండి