విజయవాడ : కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేశాం... ఇక వంశధార, నాగవళి నదులను రూ.వెయ్యి కోట్లతో అనుసంధానం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ రెండు నదుల అనుసంధానం కార్యక్రమం వచ్చే సంవత్సరానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
వంశధార నుండి వచ్చే నీళ్లు 10.6 టిఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నాయని, దానిని అరికట్టి నీటిని సద్వినియోగం చేసేందుకు అనుసంధానం చేస్తున్నామన్నారు. విశాఖపట్నానికి తాగునీరు, ఏలేరు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల మాదిరిగానే గోదావరి నది ఎడమ వైపు పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజిలో నీరు 11.2 అడుగులు నీరు ఉంచుతున్నాం - ఘాట్లలో భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం - రైతుల పంటల కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం - పుష్కర విధుల్లో అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి చెప్పారు.
పవిత్ర సంగమం వద్ద కొమ్ము నృత్యం అలంకారం
కృష్ణా, గోదావరి పవిత్ర సంగమ ప్రాంగణంలో గిరిజనుల కొమ్ము నృత్యం అలంకారం చేసుకుని మంత్రి సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. ఐ.టి. ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి దేవినేని సందర్శించారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు మంత్రి ఉమా తెలిపారు.