దివంగత శాస్త్రవేత్త, డాక్టర్ అబ్దుల్ కలాం గురించి ఓఎస్డీ డాలర్ శేషాద్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. కలాం తిరుమల వచ్చినప్పుడల్లా తనను తమిళంలోనే ఆప్యాయంగా పలకరించేవారని.. ఆర్భాటాలకు పోకుండా సామాన్య భక్తుడిలా ఆలయానికి వచ్చేవారని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కలాంకు అత్యంత ప్రీతిపాత్రమంటూ... ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ వకుళమాత దర్శనం చేసుకుని, హుండీలో కానుకలు సమర్పించేవారన్నారు.
రాష్ట్రపతి హోదాలో కలాం తిరుపతికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కానీ, టీటీడీ ఆయనకు కేటాయించిన తేదీల్లోనే శ్రీవారి దర్శనానికి రావడం ఆయన భక్తిప్రపత్తులకు నిదర్శనమని కొనియాడారు. 2009లో మాజీ రాష్ట్రపతిగా మరోసారి తిరుమల వచ్చి నిరుపేదల కోసం ఆయన అర్చన చేయించారని శేషాద్రి గుర్తుచేసుకున్నారు.