సీఎం జగన్‌కు షాకిచ్చిన కేంద్రం... స్టీఫెన్ రవీంద్ర బదిలీకి బ్రేక్!

శనివారం, 29 జూన్ 2019 (12:46 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.. సుపరిపాలన అందించే నిమిత్తం తనకంటూ ప్రత్యేకమైన జట్టును ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఇందులోభాగంగా, ఏపీ నిఘా విభాగం అధిపతిగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఎంచుకున్నారు. ఆయన్ను తమ రాష్ట్రానికి బదిలీ చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమత్రి కేసీఆర్‌ను కోరగా ఆయన ఓకే చెప్పడం, స్టీఫెన్ రవీంద్ర అంతర్రాష్ట్ర బదిలీకి సంబంధించిన ఫైలుపై సంతకం చేయడం ఆగమేఘాలపై జరిగిపోయింది. దీంతో ఏపీ నిఘా విభాగం కొత్త చీఫ్ స్టీఫెన్ రవీంద్ర నియమితులు కావడం తథ్యమని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం కేంద్రం హోంశాఖ పరిధిలోని డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం) తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. సరిగ్గా ఇపుడు స్టీఫెన్ రవీంద్ర ఫైలుపై డీవోపీటీ మెలికపెట్టింది. అంతరాష్ట్ర డిప్యుటేషన్‌కు సహేతుకమైన కారణం లేదన్న సాకుతో డీవోపీటీ ఫైలును పక్కనపెట్టేసినట్టు తెలుస్తోంది. 
 
సీఎం స్థాయిలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తే తప్ప ఇది కొలిక్కి వచ్చేలా లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నాకా డీవోపీటీ ఆపడం ఏమిటనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా హోం మంత్రి అమిత్ షాతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు