చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ సీఎస్.. 18 జీవోలు రద్దు

శనివారం, 20 ఏప్రియల్ 2019 (11:08 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తేరుకోలేని షాకిచ్చారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ పూర్తయిన తర్వాత ఏపీ సర్కారు జారీ చేసిన 18 జీవోలను రద్దు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుతో ప్రభుత్వ ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రద్దు చేశారు. అదేసమయంలో చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు అందాయి. 
 
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత, ప్రకృతి విపత్తులు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే సీఎం సమీక్షలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం ముందుగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈనెల 11వ తేదీన ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసింది. 
 
ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్షలు నిర్వహించారు. అలాగే, చంద్రబాబు సర్కారు జారీ చేసిన 18 రకాల జీవోలను కూడా రద్దు చేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో సీఎస్ ఆ జీవోలను రద్దు చేశారు. ఈ జోవోలన్నీ కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. 
 
అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలకు హాజరైన అధికారులపై కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే వీరి నుంచి సంజాయిషీని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు