ఏపీ ప్రజల ఆందోళన అర్థమైంది... బాబుతో మాట్లాడా.. త్వరలో పరిష్కారం : అరుణ్ జైట్లీ

మంగళవారం, 2 ఆగస్టు 2016 (15:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఆందోళలను తాము అర్థం చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. పైగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడానని, త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుగొంటానని తెలిపారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుతూ రాష్ట్రానికి అధికార, విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపజేశాయి. మంగళవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కలిసికట్టుగా ఆందోళనకు దిగారు. దీంతో జీరో అవర్ తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలు తమకు తెలుసని అన్నారు. సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడుతో తాను మాట్లాడి, అన్ని విషయాలు చర్చించానని ఆయన తెలిపారు. 
 
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. సమస్యకు త్వరలోనే పరిష్కార మార్గం కనుగొంటామని హామీ ఇచ్చారు. పైగా, ఎంపీల ఆందోళనను అర్థం చేసుకున్నామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి