ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు: మాజీ మంత్రి దేవినేని ఉమ

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:03 IST)
ధరల స్థిరీకరణ నిధులతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన అబద్దాల జగన్ ప్రభుత్వం మూడువేల కోట్ల ధరల స్థిరీకరణ నిధులను  ఏం చేసారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.

ఈ నిధులను ఎంత ఖర్చు పెట్టి రైతుల దగ్గర ఉన్నపంటలను కొనుగోలు చేసారో తెలియజెయ్యాలని డిమాండ్ చేసారు. బుధవారం తెల్లవారుఝామున అకాల వర్షం కారణంగా తడిసిపోయిన ధాన్యాన్మి క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు విజయవాడ రూరల్ మండలంలోని షాబాద్-పైడూరుపాడు గ్రామాలకు వెళ్లారు.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన తరువాత అక్కడి ధాన్యం రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం సకాలంలో పంట చేలల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయనందునే ధాన్యం రైతు పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. 
 
రాష్ట్రంలో 55 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉ‌ందని, దీనిని కొనుగోలు చేసే దిక్కులేదని ధ్వజమెత్తారు. అకాల వర్షం బారిన పడి ధాన్యం తడిసిపోతున్నా సంబంధిత శాఖ మంత్రికి చీమైనా కుట్టినట్ల లేదని ఆరోపించారు. 
 
కూలీలు రాక, ధాన్యం సంచులు లేక, కల్లాలలోని ధాన్యాన్ని కొనే దిక్కు లేక రైతులు పడుతున్న అవస్థలు కన్నీరు తెప్పిస్తున్నట్లు చెప్పారు. కమీషన్లకు కక్కుర్తి పడి రూ.6400 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై నిధులు ఖర్చుపెట్టడం లేదని దుయ్యబట్టారు. 
 
ధాన్యానికి రూ.1376లు మద్దతుధర ఉంటే, దళారులు రూ.800 నుండి రూ.900లకు కొనుగోలు చేసి రైతుల కడుపుకొడుతున్నట్లు తెలిపారు. 
 
ధాన్యానికి కరోనా వైరస్ వచ్చిందని ప్రచారం చేస్తూ, అన్నదాతలను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. టన్నుల కొద్ది ఇసుక తరలింపుపై పెడుతున్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై పెట్టకపోవడం రైతు చేసుకున్న దురదృష్టంగా ఆయన అభివర్ణించారు.
 
పులివెందులలో ఒకరు, నెల్లూరులో మరొకరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా ప్రభుత్వంలో చలనం లేకపోవటం ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. 

రైతులకు ఇవ్వాల్సిన ఐదువందల కోట్ల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు