క్షుద్రపూజల కోసం బాలికను బలిచ్చేందుకు సిద్ధమైన నలుగురి అరెస్టు!

బుధవారం, 25 మే 2016 (15:49 IST)
గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తూ బాలికలను బలి ఇవ్వాలనుకున్న నలుగురిని రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కడియం మండలం గుర్లంక గ్రామానికి చెందిన గణపతి అనే వ్యక్తి రాజమండ్రి నారాయణపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వెనుక ఆరు నెలలుగా ఓ గదిని అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. 
 
అతని వద్దకు వెంకన్నదొర (దేవీపట్నం), అమలాపురానికి చెందిన రామ్‌కుమార్, రంపచోడవరానికి చెందిన కాణెం పార్వతీదేవి, ఆమె కుమార్తె పావని (7) వచ్చారు. మంగళవారం అర్థరాత్రి వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 
 
ఆసమయంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండటం, క్షుద్ర పూజలకు సంబంధించిన సామగ్రితో, కత్తి, రెండు గడ్డపారలు కనిపించడంతో బాలికను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్షుద్రపూజకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన సామానులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి