ఏపీలో రేపటి నుండి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ

శుక్రవారం, 15 మే 2020 (22:35 IST)
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న ఆంక్షల వల్ల పనులు చేసుకోలేని పేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం చేసింది.

శనివారం (మే 16వ తేదీ) నుంచి ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు.

అందుకోసం జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 2,330 చౌకదుకాణాల ద్వారా మొత్తం 12,92,937 కుటుంబాలకు బియ్యం, శనగలు అందించనున్నారు.  ఇప్పటికే సివిల్ సప్లయిస్ అధికారులు అన్ని చౌకదుకాణాలకు బియ్యం, శనగలు రవాణా చేశారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతికదూరంను పాటిస్తూ రేషన్ పొందాలన్నారు. ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా భౌతికదూరంను ఖచ్చితంగా పాటించడానికి, మరోవైపు వేసవిలో తీవ్రంగా వున్న ఎండల నుంచి కూడా రక్షణ పొందేందుకు చౌకదుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగించాలని జాయింట్ కలెక్టర్ మాధవిలత సూచించారు.

గొడుగు వేసుకోవడం వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఖచ్చితమైన దూరం వుంటుందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఈ సందర్బంగా ఆయన సూచించారు. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సరుకుల విషయంలో మూడో విడత మాదిరిగానే బయోమెట్రిక్ ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు.

కోవిడ్-19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైర్లను అందుబాటులో వుంచుతున్నామని, ప్రతి కార్డుదారుడు రేషన్ తీసుకునే ముందు, ఆ తరువాత కూడా రేషన్ కౌంటర్ల వద్ద  చేతులను శానిటైజ్ చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రేషన్ డీలర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.

అలాగే ఎక్కువ మంది ఒకేసారి సరుకుల కోసం రాకుండా గతంలో మాదిరిగానే రేషన్ కార్డు దారులకు వాలంటీర్లు  టైంస్లాట్ కూపన్లు కార్డుదారులకు అందచేశారని తెలిపారు.

అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు కూడా తమకు అందుబాటులో వున్న రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకునే అవకాశం వుందని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు