ఉద్యోగులకు అండగా ప్రభుత్వం: మంత్రి పేర్ని నాని

గురువారం, 2 జనవరి 2020 (19:12 IST)
ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవేసే ప్రతి పథకంలోను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉద్యోగులు వ్యవహరించడం జరుగుతుందని రవాణా, సమాచారశాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉద్యోగులు ఒక భాగమని, తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన అండగా ఉంటుందన్నారు.

ఈ విషయం లో మరో ప్రశ్నకు తావులేదన్నారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా రవాణాశాఖ(నాన్- టెక్నికల్) ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు మంత్రి పేర్ని వెంకట్రామయ్యను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నోట్ బుక్ లను అందజేశారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వలన 51 వేల 488 మంది ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, వారి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరుస్తున్నాయన్నారు.  ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికె దక్కిందని, ఇది  దేశ చరిత్రలో లిఖించతగ్గ గొప్ప విషయం అని ఆయన అన్నారు.

వైఎస్ఆర్ పార్టీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా 4 లక్షల మంది గ్రామీణ, పట్టణ యువత కు ఉపాధి అవకాశాలు దక్కించుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే ప్రభుత్వశాఖలలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చెయ్యడం జరుగుతుందని ఆయన తెలిపారు.

రవాణాశాఖ లో  ఉద్యోగుల పై ఉన్న ఒత్తిడి ని తగ్గించి, వారిద్వారా మరింత సమర్ధవంతంగా పనులు చెప్పట్టి, శాఖకు మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రవాణాశాఖ (నాన్-టెక్నికల్) ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు కె భద్రాచలం( రాజా) కార్యదర్శి సంజీవ్, కోశాధికారి  సుబ్బారెడ్డి, జోనల్ కార్యదర్శి నాగమురళి, సంఘ నాయకులు అలామ్, అంజనేయప్రసాద్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు