ఆ.. ఏముంది మనతోటి పని చేసే మహిళా టీచరేగా అనో.. లేదా రోజూ మన ఊరికి వచ్చే పంతులమ్మేగా అని అనుకుని.. నోరు జారినా.. వెకిలి చేష్టలు చేసినా.. ఇక అంతే.. సీన్ సితారా అవుతుంది. పాఠాలు చెప్పే పంతులమ్మలతో ఎందుకు పెట్టుకున్నామురా.. దేవుడా.. అని నెత్తిన నీళ్ల కడవపెట్టుకుని ఏడ్వాల్సి వస్తుంది. రోజూ పోలీసు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే.. ఇంతకీ ఏంటి విషయం...?
మహిళా టీచర్ల పట్ల వేధింపులు పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వేధింపులకు గురిచేసే వారిపై తక్షణ చర్యలు తీసుకొనేలా విచారణ కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా మహిళా టీచర్లను వేధింపులకు గురిచేసినా, వారిని సూటిపోటి మాటలతో అగౌరవ పరిచినా, ఇంకేమైనా ఇబ్బందులకు గురిచేసినా చూసీచూడనట్లు వ్యవహరించే వారు.
పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా గుర్తించి విస్మరించేది. టీచర్లు నేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం మినహా ప్రత్యేకించి విద్యాశాఖలో ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఉండేది కాదు. దీంతో సత్వర విచారణ జరిగేది కాదు. న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగానికి శ్రీకారం చుట్టింది. పలు కోణాల్లో విచారించి చర్యలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు నివేదిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులైన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలనేది ఉపాధ్యాయుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, బలవంతంగా సభ్యత్వం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అది వేధింపుల కిందకే వస్తుందని, అలాంటి ఘటనల పైనా ఉపాధ్యాయినులు ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకురావచ్చునని విద్యాశాఖాధికారులు సూచించారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.