లంబసింగి, పాడేరు ఘాట్లలో 6 డిగ్రీలు, చింతపల్లి, మినుములూరు ల్లో 9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇంకా చలి ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ద్విచక్ర వాహనాలు, ఆటోలపై వెళ్లే వారూ అవస్థలు పడుతున్నారు. షాపులు, దుకాణాల నిర్వాహకులు ఉదయం పూట ఆలస్యంగా తెరుస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలకే మూసివేస్తున్నారు. చాలామంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కాగా మరో నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య గాలులు విశాఖ వైపు వీస్తున్నాయి. ఉత్తర దిక్కులో ఉన్న చత్తీస్గఢ్, ఈశాన్యంలో ఉన్న ఒడిశాలో చలి అధికంగా ఉంది. దీంతో అటు చత్తీస్గఢ్, ఇటు ఒడిశా, ఏజెన్సీల నుంచి వచ్చే చల్లగాలులు విశాఖ నగర వాసుల్ని వణికిస్తున్నాయి.
విశాఖలోను గురువారం విశాఖ విమానాశ్రయంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం 18.8 డిగ్రీలకు దిగజారింది. ఇవి మరింతగా క్షీణించే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.