హెల్మెట్ ధారణను రోడ్డు రవాణా సంస్థ తెలంగాణలో కఠినతరం చేయనున్నది. నేటి నుంచి ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించి తీరాల్సిందేననే నిబంధనను అమలు చేయనున్నారు. ఈ విషయమై అంతర్గతంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు గురువారం కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ద్విచక్ర వాహనంతో పాటే ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ కూడా డీలర్లు విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో 80 శాతం పైగా ద్విచక్ర వాహనాలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ వేయి వరకు ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రర్ అవుతున్నాయి. ఇక నుంచి వీరంతా బైక్తోపాటు హెల్మెట్ కొనాల్సిందే. వివిధ కారణాలు, అపోహలతో చాలామంది హెల్మెట్లు వాడటం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించటానికి శిరస్త్రాణాల వినియోగం తప్పనిసరి చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.