కొండ‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో హైడ్రామా...మీడియాకు నో!

సోమవారం, 22 నవంబరు 2021 (17:37 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో హైడ్రామా న‌డుస్తోంది. మీడియాకు కూడా నో చెప్పిన అధికారులు ఎన్నిక అంతా ర‌హ‌స్యంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్న‌ట్లున్నారు. ఉదయం 10 గంటల సమయంలో మున్సిపాలిటీ కార్యాలయం లోపలికి 14మంది తెలుగుదేశం, టీడీపీకి మద్దతు ఇచ్చిన 1ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో 16మంది వార్డ్ కౌన్సిలర్ సభ్యులు వెళ్ళారు. మరికొద్ది సేపటికే కార్యాలయం లోపలికి 14మంది వైసీపీ అభ్యర్థులతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ఆధ్వర్యంలో మొత్తం 15మంది వార్డ్ కౌన్సిలర్ సభ్యులు వెళ్ళారు.

 
కార్యాలయం ఆవరణలోకి మీడియాని పోలీసులు అనుమతించ లేదు. 14మంది టీడీపీ వార్డ్ కౌన్సిలర్ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం 12గంటల సమయంలో ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుపై రాద్దాంతం జ‌రిగింది. డివిజన్ బెంచ్ కి వెళ్ళాం కాబట్టి, ఎన్నికని వాయిదా వేయాలని కోరుతూ వైసీపీ స‌భ్యులు ఆందోళన చేశారు. కాగితాలు చింపి త‌మ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ తో సహా బయటికి వచ్చారు. 

 
ఎమ్మెల్యే, వార్డ్ కౌన్సిలర్ సభ్యులు వెళ్ళిపోయిన తర్వాత కార్యాలయం బయట వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ జ‌రిగింది. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపున వైసీపీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు ఎందుకు వచ్చారంటూ, పోలీసుల ముందు టీడీపీ కార్యకర్తలు నినాదాలతో నిరసన తెలిపారు. ఛైర్మ‌న్ ఎన్నిక వాయిదా వేస్తే, లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని పట్టుపట్టారు. 

 
సాయంత్రం వరకు ఏం జరుగుతుందో తెలియని గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. చివ‌రికి సాయంత్రం  5 గంటల సమయంలో ప్రిసైడింగ్ అధికారికి టీడీపీ వార్డ్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణ భయం ఉంద‌ని, కాబట్టి ఈ రాత్రికి మున్సిప‌ల్ కార్యాలయంలోనే ఉండడానికి అనుమతి కోరారు. ఇంకా టీడీపీ,  ఇండిపెండెంట్ వార్డ్ కౌన్సిలర్ల‌తో ఎంపీ కేశినేని నాని కార్యాలయం ఆవరణలోనే ఉండిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు